హథ్రాస్ తొక్కిసలాటలో మృతులు 121 మంది.. పరారీలో భోలే బాబా

ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 121కి పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను ఐస్‌బాక్స్‌ల్లో పెట్టి భద్రపరుస్తున్నారు. మరోవైపు, తమవారి కోసం వస్తున్న బాధితులతో ఆసుపత్రి పరిసరాలు కిక్కిరిపోయాయి. ఎటుచూసినా విషాదం కనిపిస్తోంది. సికింద్రారౌ ప్రాంతంలోని ఫుల్రాయ్ గ్రామంలో నిన్న భోలేబాబా నిర్వహిచిన సత్సంగ్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాదిగా హాజరైన భక్తులు భోలేబాబా కాళ్లను తాకేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది.

సత్సంగ్‌‌కు దాదాపు 2.5 లక్షల మంది హాజరైనట్టు ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ మనోజ్‌కుమార్ సింగ్ తెలిపారు. కానీ, నిర్వాహకులు మాత్రం 80 వేల మందికి మాత్రమే అనుమతి తీసుకున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేడు హథ్రాస్‌ను సందర్శించనున్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని వదిలిపెట్టేది లేదని సీఎం హెచ్చరించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం 24 గంటల్లో నివేదిక అందించాలని ఆదేశించింది. సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు, ఘటన తర్వాత స్వయం ప్రకటిత గాడ్‌మన్ భోలేబాబా పరారయ్యాడు. ఆయన కోసం గాలింపు మొదలైంది.

Hathras Stampade
Bhole Baba
Uttar Pradesh

More Telugu News